పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ రోజు భట్టి విక్రమార్క ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచారు. ప్రజానేత అంటూ నెటిజన్లు ఆయనపై ట్వీట్ల వర్షం కురిపించారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
హైదరాబాద్: సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎండ దెబ్బతో వైద్యుల సూచనల మేరకు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన తిరిగి ఈ రోజు పాదయాత్రను పున:ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గం కేతెపల్లి నుంచి ఈ రోజు ఉదయం ఆయన పాత్ర ప్రారంభించారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు సంబురాలు చేసుకున్నాయి. మల్లు భట్టి విక్రమార్కను సత్కరించాయి. కేక్ కట్ చేయించారు.
వీటికి తోడు అదనంగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భట్టి విక్రమార్క ఈ రోజు ట్రెండింగ్లో నిలిచారు. పీపుల్స్ లీడర్ భట్టి అనే హ్యాష్ట్యాగ్తో ఈ రోజు మధ్యాహ్నం పూట కొద్ది సేపు ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని చాలా కీలక పరిణామాలు సైతం ట్రెండింగ్కు నోచుకోవు. కానీ, ఒక పార్టీ పాదయాత్ర, ఒక ఎమ్మెల్యే పాదయాత్ర ట్రెండింగ్లో నిలవడం గమనార్హం.
Also Read: 100 Days: వంద రోజులకు చేరిన భట్టి విక్రమార్క పాదయాత్ర.. పట్టువదలని విక్రమార్కుడిలా..!
100 రోజుల సందర్భంగా ఉప్పలపాడు గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కేక్ కట్ చేసి భట్టికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ ఖమ్మం నుంచి అనుచర గణంతో ఉప్పలపాడుకు చేరుకుని పూలమాలలు, శాలువాలతో భట్టిని సత్కరించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఇంకా పలువురు పార్టీ నేతలు ఆయనను ప్రశంసించారు.
