భద్రకాళీ ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్ అరెస్ట్
నిబంధనలకు విరుద్దంగా భద్రకాళీ ఫైర్ వర్క్స్
వరంగల్: వరంగల్లోని భద్రకాళీ ఫైర్ వర్క్స్ ప్యాక్టరీ యజమాని బాంబుల కుమార్ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జనావాసాల మధ్య ఈ ఫ్యాక్టరీని ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం పలు శాఖల నుండి ఎలాంటి అనుమతులు కూడ లేవని అధికారులు ప్రకటిస్తున్నారు.అయితే అనుమతులు లేకుండా ఈ ఫ్యాక్టరీని ఎలా ఇక్కడ నిర్వహించేందుకు అనుమతించారనే విషయమై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వరంగల్లో జనావాసాల మధ్యే ఈ ఫ్యాక్టరీ కొనసాగుతోంది. అయితే ఫ్యాక్టరీని ఎత్తివేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అధికారులు పట్టించుకోలేదు.నిబంధనలకు విరుద్దంగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
అగ్నిమాపక శాఖతో పాటు ఇతర శాఖల నుండి కూడ ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఫ్యాక్టరీ ఇంత కాలంగా ఎలా కొనసాగుతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్యాక్టరీ యజమాని బాంబుల కుమార్ను ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఈ ఫ్యాక్టరీ నిర్వహించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వరంగల్ ప్రమాదంపై సీఎం దిగ్బ్రాంతి
వరంగల్ లో జరిగిన ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామి ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.ఈ ఘటనపై డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.