మద్యం ప్రియులకు చేదువార్త
మద్యం ప్రియులకు చేదువార్త. బీరు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వేసవిలో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లపైనే ఆసక్తి చూపిస్తారన్న విషయం అందిరికీ తెలసిందే. అలాంటి బీర్ల ధరలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. తెలంగాణ సర్కార్ సరిగ్గా గతేడాది డిసెంబర్ చివర్లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) మద్యంపై తొలిసారిగా క్వార్టర్కు రూ.10 చొప్పున పెంచేసింది.
తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని 15 డిస్టరీలకు వివిధ బ్రాండ్ల మద్యం సరఫరా చేసేది. బేసిక్ ఫ్రైస్ను కార్పోరేషన్ నిర్ణయించి డిస్టరీలకు చెల్లించేది. 2012 నుంచి ఈ రేట్లు పెంచకపోవడంతో గతేడాది వీటిని మొదటిసారిగా పెంచేసింది. చీప్ లిక్కర్ మొదలుకుని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్పై 9 శాతం పెంచేసింది. అప్పట్లో బీర్లను మినహాయించింది.
ఇప్పుడు హఠాత్తుగా మంగళవారం నుంచి బీర్లపై కూడ రూ.10 నుంచి రూ.20 వరకు పెంచేసింది. గత కొద్ది రోజులుగానే వరంగల్ ఐఎంఎఫ్ఎల్ గోదాంల నుంచి జిల్లాలోని మద్యం దుకాణాలకు బీర్లు ఇవ్వడం తగ్గించేశారు. ఏకంగా రేటు పెరిగిన బీర్లను మంగళవారం సరఫరా చేయలేదు. కానీ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటేడ్ పేరిట బీర్ల ప్రైస్ లిస్టు 22 మే 2018 నుంచే అమలవుతున్నట్లు మద్యం దుకాణదారులకు అందింది.
దీనికి సంబంధించిన వివిధ బ్రాండ్లకు చెందిన 330 ఎంఎల్ చిన్న బీర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచేశారు. అదే రీతిన 650 ఎంఎల్ పెద్ద బీర్ బాటిళ్లపై ఇదే తరహాలో డిమాండ్ ఉన్న బ్రాండ్లకు రూ.20 పెంచేశారు.డిమాండ్లేని బ్రాండ్ బీర్లకు రూ.10 మాత్రమే పెంచినట్లు సమాచారం.
