Warangal Forest: వరంగల్లో అడవులు ఎంత అందగా ఉన్నాయో.. బ్యూటీఫుల్ వీడియో షేర్ చేసిన ఎరిక్ సోల్హీమ్
తెలంగాణ అడవుల్లోని పచ్చదనం ఎంత అందగా ఉందో తెలిపే అద్భుతమైన వీడియోను ఎరిక్ సోల్హీమ్ (Erik Solheim) ట్విట్టర్లో షేర్ చేశారు. వరంగల్లోని (Warangal) ఆకర్షణీయమైన ఈ పచ్చటి అడవులను చూడండి ఉంటూ అద్భుతమైన వీడియోను షేర్ చేశారు.
తెలంగాణలో పచ్చదనం (greenery) పెరిగింది. అటవీ విస్తీర్ణం కూడా క్రమంగా పెరుగుతోంది. చాలా ప్రాంతాలు టూరిస్ట్ స్పాట్లుగా మారుతున్నాయి. పచ్చని అందాలతో అడవులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆ అందాలు చూస్తే మనం నిజంగా తెలంగాణలోనే ఉన్నామా..? అని అనిపించక మానదు. తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారంలో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు పర్యావరణ వేత్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా ప్రముఖ పర్యావరణ వేత్త, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ (Erik Solheim) ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
తెలంగాణ అడవుల్లోని పచ్చదనం ఎంత అందగా ఉందో తెలిపే అద్భుతమైన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘అందమైన తెలంగాణ.. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం.. తక్కువ సమయంలో 3 శాతం పచ్చదనాన్ని పెంచుకుంది. వరంగల్లోని ఆకర్షణీయమైన ఈ పచ్చటి అడవులను (Lush green forests of Warangal) చూడండి’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల అనేక ప్రకృతి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించుకోకుంటా పతనం తప్పదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2030 నాటికి దేశంలో అడవుల శాతాన్ని 33శాతానికి పెంచాలని అటవీ శాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నప్పటికీ.. లక్ష్యం చేరుకోవాలంటే నిర్లక్ష్యం వీడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రజల్లో కూడా పర్యావరణంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
ఇక, దేశంలో అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణతకు సంబంధించిన అంశాలను సర్వే చేస్తుంది. భారత అటవీ సర్వే 2019 లెక్కల ప్రకారం.. తెలంగాణ అటవీ విస్తీర్ణం 163.31 చ.కి.మీ. పెరిగింది. ఇక, తెలంగాణలో కేవలం వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనే దట్టమైన అడవులు ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇఆరు విడతలుగా విజయవంతమైన హరితహారం ఏడోదశ కొనసాగుతుంది. 230 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే లక్ష్యానికి చేరువయ్యారు. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరుగిందేకు ఎంతగానో దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత మూడేళ్ల నుంచి సమృద్దిగా వర్షాలు కురవడం కూడా పచ్చదనం పెరగడానికి ఒక కారణం.