నాకు చెప్పకపోవడం తప్పేమీ కాదు.. : పొంగులేటితో బీజేపీ నేతల భేటీపై బండి సంజయ్
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గురువారం బీజేపీ నేతలు భేటీ కానున్నారు.ఈ క్రమంలోనే బీజేపీలో పొంగులేటి చేరిక ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గురువారం బీజేపీ నేతలు భేటీ కానున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీలో పొంగులేటి చేరిక ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈటల బృందం భేటీపై తనకు సమాచారం లేదని చెప్పారు. ఆ విషయం తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని అన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారని చెప్పారు.
తనకు తెలిసినవారితో తాను.. ఈటల రాజేందర్కు తెలిసన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. పొంగులేటి అంశం తనకు చెప్పకపోవడంలో తప్పు ఏం లేదన్నారు. తనకు ఫోన్ లేదు కనకు సమాచారం లేదని కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే.. గతకొంతకాలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కింద బీఆర్ఎస్ నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తోంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి.. తాను ఏ పార్టీలో చేరనున్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు పొంగులేటితో తెర వెనక చర్చలు జరుపుతున్నారు. అయితే ఈరోజు టీ బీజేపీ చేరికల కమిటీ పొంగులేటిని కలవనుంది.
ఈటెల రాజేందర్ నేతృత్వంలోని టీ బీజేపీ చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు ఈరోజు ఖమ్మం బయలుదేరారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్కు నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా పొంగులేటిని వారు బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే పొంగులేటి బీజేపీలో చేరతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.