ఖమ్మంలో పోలీసుల వేధిస్తున్నారని సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఖమ్మంలో పోలీసుల వేధిస్తున్నారని సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న సాయి గణేష్ మృతిపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. సాయి గణేష్పై 16 కేసులు పెట్టారని అన్నారు. బీజేపీ కార్యకర్త కాబట్టే పీడీ యాక్ట్ పెట్టారని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలు పెక్కి బరితెగించాడని మండిపడ్డారు. మంత్రి అవినీతిని సాయి గణేష్ ప్రశ్నించాడని.. ఇది మంత్రి పువ్వాడ, పోలీసులు చేసిన హత్య అని ఆరోపించారు.
ఇక, సాయి గణేష్ అనే యువకుడు బీజేపీ మజ్జూరు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాయి గణేష్ మృతిచెందాడు.
అయితే అధికార పార్టీ నేత ఒత్తిడితో కేసులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. సాయి గణేష్పై పోలీసులు 16 కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక, సాయి గణేష్ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతోపాటు పలువురు పరామర్శించారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలియజేసి.. ఆయన సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించినట్టుగా బీజేపీ నేతలు చెప్పారు.
సాయి గణేష్ ఆత్మహత్యకు యత్నించడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ప్రదర్శనగా ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. స్థానిక మంత్రి ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
