కవితపై అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్.. తీవ్ర ఉద్రిక్తత..
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బండి సంజయ్ను రాష్ట్ర మహిళా కమిషన్ విచారించనుంది.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బండి సంజయ్ను రాష్ట్ర మహిళా కమిషన్ విచారించనుంది.అయితే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇక,కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించారు. అయితే ఇందకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ మార్చి 15న తమ ఎదుట హాజరుకావాలని బండి సంజయ్కు సమన్లు జారీచేసింది.
అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నందున మార్చి 18న హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్కు లేఖ రాశారు. అయితే బండి సంజయ్ అభ్యర్థనను రాష్ట్ర మహిళా కమిషన్ ఆమోదించింది. మార్చి 18 ఉదయం 11 గంటలకు తన ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఆ రోజున హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే నేడు బండి సంజయ్.. రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు.