హైదరాబాద్ పోలీసులకు మెడల్ అంకితమిచ్చిన పీవీ సింధు..!
ఆమె వెంట సింధు తండ్రి పీవీ రమణ కూడా హాజరయ్యారు. ఆమె చేతుల మీదగా ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. గత ఒలంపిక్స్ లో రజతం గెలిచిన సింధు.. ఈ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించింది. ఈ నేపథ్యంలో.. ఆమెకు ఎక్కడకు వెళ్లిన గ్రాండ్ వెల్ కమ్ లభిస్తోంది. తాజాగా.. హైదరాబాద్ లో ఆమెకు నగర పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఒలంపిక్స్ లో అదరగొట్టి.. దేశానికి పతకం తీసుకువచ్చిన సింధుని పోలీసులు సన్మానించారు.
అశ్వాలతో కవాతు నిర్వహించి పోలీస్ కమిషనరేట్ వరకు తీసుకొచ్చారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ అంజనీ కుమార్ శుభాకాంక్షలు చెబుతూ లోపలికి ఆహ్వానించారు. ఆమె వెంట సింధు తండ్రి పీవీ రమణ కూడా హాజరయ్యారు. ఆమె చేతుల మీదగా ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా. .. సింధు తాను సాధించిన మెడల్ ని హైదరాబాద్ పోలీసులకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో.. పోలీసులు ఉత్తమ సేవలు అందించారని.. ఈ సందర్భంగా తాను తన మెడల్ ని వారికి అంకితమిస్తున్నట్లు చెప్పారు.
కాగా.. అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో పతకం సాధించి దేశానికి మరింత పేరు తెచ్చారని మెచ్చుకున్నారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ వరుసగా రెండోసారి పతకం సాధించడం మాములు విషయం కాదని సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు.