బాబు మోహన్ బీజేపీ పార్టీ నుంచి వీడిన తర్వాత ఈ రోజు కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతిలో చేరారు. కేఏ పాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలిపారు.
బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆయన కేఏ పాల్ సారథ్యంలోని ప్రజా శాంతి పార్టీలోకి చేరారు. బాబు మోహన్కు కండువా కప్పి కేఏ పాల్ తన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆఫీసులో ఈ రోజు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.
బాబు మోహన్ ప్రముఖ టాలీవుడ్ నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేశారు. మంత్రిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే ఆయనకు, ఆయన తనయుడికి మధ్య విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయాల విషయాల్లోనే ఈ విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత బాబు మోహన్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఇచ్చినా.. ఆయన స్వీకరించలేదు.
బాబు మోహన్ పార్టీలో చేరడం గురించి కేఏ పాల్ మాట్లాడారు. బాబు మోహన్ చేసిన సేవలు అందరికీ సుపరిచితం అని వివరించారు. 1451 సినిమాల్లో ఆయన నటించి మెప్పించారని తెలిపారు. ఆయన జన్మించిన వరంగల్ నుంచి ప్రజా శాంతి పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఆయన దిగుతారని వెల్లడించారు.
Also Read: March 4-Top Ten Stories: టాప్ టెన్ వార్తలు
తెలుగు ప్రజలు ఇన్ని రోజులు, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పాలనలు చూశారని, ఒక్కసారి ప్రజా శాంతి పార్టీ పాలననూ చూడాలని కేఏ పాల్ సూచించారు. తెలంగాణలో బాబు మోహన్ను గెలిపించి బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రజలను కోరారు.
