బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు
భయంతో కారు దిగని బాబు మోహన్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ కి చుక్కెదురైంది. గ్రామస్థులు ఆయనకు చుక్కలు చూపించారు. గ్రామస్థుల భయంతో కనీసం బాబు మోహన్ కారులో నుంచి బయటకు అడుగు పెట్టడానికి కూడా వణికిపోయారు. ఈ ఘటన మోదక్ జిల్లా రేగోడ్ మండలంలోని సిందోల్ గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సిందోల్ గ్రామంలో ఆదివారం రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు ఎమ్యెల్యే కారును అడ్డుకున్నారు.
కారుముందు ఉండి బాబూమోహన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నిరసన కారుల తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అరగంట పాటు ఆయన కారును గ్రామస్థులు నిలిపివేశారు. కనీసం కారులో నుంచి కాలు కూడా ఆయన బయటకు పెట్టలేకపోయారు. పోలీసులు జోక్యంతో ఎమ్యెల్యే కారు చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్దకు కదిలింది.