టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు చేదు అనుభవం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అందోల్ శాసనసభ్యుడు బాబూమోహన్కు చేదు అనుభవం ఎదురైంది.
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అందోల్ శాసనసభ్యుడు బాబూమోహన్కు చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజచేసేందుకు వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి, స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.
సంగారెడ్డి జిల్లాలోని అంథోల్లో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న విద్యుత్తు ఉపకేంద్రం పనులకు భూమి పూజ చేసేందుకు బాబూమోహన్ జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లుతో కలిసి విచ్చేశారు.
గతంలో ఆ స్థలాన్ని ఓ సంఘానికి కేటాయించారని అంటూ దాన్ని ఇప్పుడు విద్యుత్తు ఉప కేంద్రానికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.
దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.