ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో  అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతూ  వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు  మంగళవారం నాడు  అరెస్ట్ చేశారు.  


నాగోలు: ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతూ వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబంతో పాటు ఈసీఐఎల్‌లో నివాసం ఉంటుంది.ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి ద్వారా సంతోష్‌నగర్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన ఎండీ అజహర్‌ఖాన్ అనే యువకుడు ఆమెకు ఫేస్‌బుక్ లో పరిచయమయ్యాడు.

అజహర్‌ఖాన్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా ఈ మహిళతో అజహర్‌ఖాన్ ఫ్రెండ్ గా మారాడు. అయితే తరచూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. అయితే చాటింగ్ సమయంలో ఆ మహిళ అజహర్‌ఖాన్‌తో దురుసుగా వ్యవహరించిందని కక్ష పెంచుకొన్నాడు.

ఈ ఏడాది సెప్టెంబర్ 13 తేదీ నుండి ఫేస్‌బుక్‌లో ఆమెకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపుతున్నాడు. అంతేకాదు ఇంటర్నెట్‌లోని నగ్న చిత్రాలను ఆ మహిళ ముఖాన్ని మార్పింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలను తీసేయాలని బాధితురాలు అతడిని కోరింది. అయినా అతను పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచకొండ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.నిందితుడు ఉపయోగించి కంప్యూటర్, మొబైల్ ఆధారంగా మంగళవారం నాడు అతడిని అరెస్ట్ చేశారు.