జగిత్యాల జిల్లాలో ఏటీఎం చోరీ.. డబ్బుతో పారిపోయే సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. అర్దరాత్రి సమయంలో కోరుట్లలోని ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఈ చోరీలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. అర్దరాత్రి సమయంలో కోరుట్లలోని ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఈ చోరీలో పాల్గొన్నారు. చోరీ చేసిన నగదును బాక్స్లలో పెట్టుకుని కార్లలో పారిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం హైదరాబాద్ హెడ్ ఆఫీను అప్రమత్తం చేసింది. దీంతో వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల వాహనం వెల్లి దొంగల కారును ఢీకొట్టింది. దీంతో డబ్బు ఉన్న బాక్స్ల నుంచి నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరోవైపు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది.ఇక, అక్కడ లభించిన నగదు మొత్తం దాదాపు రూ. 19 లక్షలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంతో పాటు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.