కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన స్వామి నాయుడు, జనసేనలోకి చిరంజీవి అభిమానులు
చిరంజీవి అభిమానులు జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ తో మూడు రోజుల క్రితం చిరంజీవి అభిమాన సంఘం నేత స్వామినాయుడు సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీన జనసేనలో స్వామినాయుడు చేరనున్నారు. పలు జిల్లాల నుండి వచ్చిన అభిమానులు స్వామినాయుడుతో కలిసి పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది.
హైదరాబాద్: చిరంజీవి అభిమాన సంఘం నేత స్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన ఆయన జనసేనలో చేరనున్నారు. స్వామి నాయుడుతో పాటు పలువురు చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో జనసేనలో చేరనున్నారు. చలో హైద్రాబాద్ పేరిట చిరంజీవి అభిమానులు హైద్రాబాద్కు తరలివస్తున్నారు.
సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పీఆర్పీలో చేరారు.ఆ సమయంలో అభిమానులను ఏకం చేయడంలో స్వామినాయుడు కీలకంగా వ్యవహరించారు. పీఆర్పీలో స్వామినాయుడు కీలకంగా ఉన్నారు.
అయితే కొన్ని కారణాలతో పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేశారు. విలీనంతో దీంతో స్వామినాయుడు చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మూడు రోజుల క్రితం స్వామినాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో చర్చించారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు మార్గం సుగమమైంది.
దీంతో ఇవాళ స్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన జనసేనలో చేరనున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని చిరంజీవి అభిమానులను కూడ జనసేనలో చేరేలా స్వామినాయుడు వ్యూహరచన చేస్తున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో చిరంజీవి అభిమానులంతా జనసేనలో చేరనున్నారు. చిరంజీవి అభిమానులు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం రాజకీయంగా ఆ పార్టీకి ఏ మేరకు నష్టం కల్గిస్తోందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రానున్న ఎన్నికల్లో ఈ విషయమై కొంత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా స్వామి నాయుడు కొనసాగుతున్నారు. ఈ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వామినాయుడు రాజీనామా చేశారు.