Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు .. ‘‘సహకారం’’ కావాలంటూ ట్వీట్

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదర భావం, సహకారం వుండాలని ఆయన ఆకాంక్షించారు. 

ap cm ys jagan mohan reddy congratulates telangana cm revanth reddy deputy and his cabinet colleagues ksp
Author
First Published Dec 7, 2023, 5:13 PM IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క.. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు. 

 

 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘ తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావులు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొత్త మంత్రులకు అభినందనలు తెలియజేశారు. 

Also Read: జైలుకెళ్లిన నేతలకు ముఖ్యమంత్రి పదవులు: నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడు రేవంత్...రేపు చంద్రబాబుకు దక్కేనా?

అంతకుముందు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ నినాదంతో స్పీచ్ ప్రారంభించారు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో, త్యాగల పునాదులతో ఏర్పడిందని అన్నారు. ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరనే ద్యేయంగా తెలంగాణ ఏర్పడిందని... కాంగ్రెస్ పార్టీ సమిదిగా మారి తెలంగాణను ఏర్పాటుచేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

అయితే త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్లు సరైన పాలన సాగలేదని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెబుదామంటే వినేవాళ్లు లేకుండాపోయారని అన్నారు. అందువల్లే ప్రజలు ఆ పార్టీని  ఓడించారని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం వెనకున్నది కార్యకర్తలేనని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆలోచనను ఉక్కుసంకల్పంగా మార్చి, తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారని అన్నారు. 

కాబట్టి రాష్ట్రంలో తాను, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా వుంటుందని రేవంత్ అన్నారు. ఇప్పటినుండి తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని... ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు స్వేచ్చ స్వాతంత్రాలు వచ్చాయన్నారు. ప్రగతి చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను ప్రమాణస్వీకారం వేళ బద్దలుగొట్టించామని రేవంత్ తెలిపారు. తన తెలంగాణ కుటంబసభ్యులు ఎప్పుడు రావాలన్నా ప్రగతిభవన్ కు రావచ్చని... సమస్యలు చెప్సుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనను మిళితం చేస్తానని.. మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios