Anumula Revanth Reddy...న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ: కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు
న్యూఢిల్లీలో అనుముల రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని నేతలను కోరుతున్నారు.
![Anumula Revanth Reddy meets Mallikharjun Kharge in New delhi lns Anumula Revanth Reddy meets Mallikharjun Kharge in New delhi lns](https://static-ai.asianetnews.com/images/01hgqaa5ksmjnx9naep73th1r7/Revanth_Reddy-1701589620344_363x203xt.jpg)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ నెల 5వ తేదీన ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే. సీ. వేణుగోపాల్ మంగళవారంనాడు సాయంత్రం రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి న్యూఢిల్లీకి వెళ్లారు. బుధవారంనాడు ఉదయం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కే.సీ. వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో నిన్న జరిపిన చర్చల వివరాలను కే. సీ . వేణుగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. మరో వైపు రేపు తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని వేణుగోపాల్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
కే.సీ. వేణుగోపాల్ తో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై కూడ రేవంత్ రెడ్డి ఖర్గేతో చర్చించే అవకాశం లేకపోలేదు. ఖర్గేతో భేటీ ముగిసిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికను మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసింది. ఈ సమావేశం మేరకు కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి పేరును సీఎల్పీ నేతగా ఖరారు చేసింది.
also read:నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు.
also read:2004 సెంటిమెంట్ రీపీట్:తెలంగాణలో హస్తం హవా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ దఫా అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు సమిష్టిగా కృషి చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలు చేసిన వ్యూహత్మక తప్పిదాలు కూడ కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు.