తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు ...: వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలు అన్నదాతలను నిండా ముంచగా మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతులను కలవరపెడుతోంది.
హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశంలోని పలురాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి.మరో రెండ్రోజులు (ఆది, సోమవారం) కూడా తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఉరుములు మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... అన్నదాతలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
గత శుక్రవారం నుండి శనివారం వరకు రాష్ట్రంలోని పలుజిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసాయని వాతావరణ అధికారులు తెలిపారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడులొ అత్యధికంగా 3 సెంటీమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.ఈ రెండ్రోజులు ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఎండలు తక్కువగా వుండి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయని తెలిపారు.
Read More బీఆర్ఎస్ అంటేనే 'భారత రైతు సమితి' : కేటీఆర్
ఇదిలావుంటే ఇటీవల కురిసిన వడగళ్లు, ఈదురుగాలుల కూడిన భారీ వర్షాలు తెలంగాణ రైతాంగాన్ని నిండాముంచాయి. చేతికందివచ్చిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. దీంతో నష్టపోయిన రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు.
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం కేసీఆర్ ఇటీవల పరిశీలించారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం పర్యటించిన స్వయంగా రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం ఏ స్థాయిలో వుందో తెలుసుకున్న కేసీఆర్ అన్నదాతలకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే దెబ్బతిన్న పంటలు ఎకరానికి పదివేల ఆర్థికసాయం ప్రకటించారు.