టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు : సిట్ అదుపులో మరో ముగ్గురు.. 39కి చేరిన అరెస్ట్లు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రాయ్పూర్కు చెందిన దివ్య, రవి, కిశోర్లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన రాయ్పూర్కు చెందిన దివ్య, రవి, కిశోర్లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 39కి చేరింది.
ఇదిలావుండగా.. పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జ్గా వున్న శంకర్ లక్ష్మీ పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆమె కాల్ డేటా వివరాలను సేకరించారు అధికారులు, 2017 నుంచి టీఎస్పీఎస్సీలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. టీఎస్పీఎస్సీ అధికారులు ఇచ్చిన సమాచారంలో తేడాలు వున్నట్లు సిట్ గుర్తించింది. డీఏవో, ఏఈఈ, ఏఈ పేపర్ల లీక్ అంశంలో టీఎస్పీఎస్సీ వివరాలు దాచిపెట్టినట్లు సిట్ గుర్తించింది. అలాగే పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని టీఎస్పీఎస్సీ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సిట్ అనుమానిస్తోంది.
Also Read: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్ : శంకర్ లక్ష్మీ పాత్రపై అనుమానాలు .. కమీషన్పై సిట్ ఆగ్రహం
తమకు తప్పుడు వివరాలు ఇవ్వడంతో కమీషన్పై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైనా సమాచారం ఇవ్వకపోవడం ఏంటంటూ సిట్ అధికారులు ఫైర్ అయ్యారు. దర్యాప్తునకు సహకరించని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని టీఎస్పీఎస్సీ అధికారులను సిట్ హెచ్చరించింది. అటు ఈ కేసులో కీలక నిందితురాలిగా వున్న రేణుక రాథోడ్ వ్యవహారారనికి సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో రేపు మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చింది. రేణుక నుంచి గంభీరాం రాహుల్కు గ్రూప్ పేపర్ వెళ్లినట్లుగా సిట్ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో రాహుల్ పాత్రపైనా సిట్ దర్యాప్తు ప్రారంభించింది. .