మరో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఆదిలాబాద్ ఘటన
ఇంటర్ పరీక్షలో ఫెయిలయ్యానని మనస్థాపం చెందిన ఓ స్డూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీలో బుధవారం జరిగింది.
ఇంటర్ ఫలితాలు మరొకరి ప్రాణం తీశాయి. వారం రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంగా ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో మరొకటి చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన బుర్రివార్ నందిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. అక్టోబర్లో జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసింది. వారం రోజుల క్రితం విడుదలైన పరీక్ష ఫలితాల్లో పాస్ కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందింది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన నందిని చదివే కాలేజీలో తెలియడంతో అందరూ షాక్ కు గురయ్యారు. స్నేహితులు తీవ్రంగా రోదించారు. కాలేజీలో స్టూడెంట్లందరూ మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించారు.
హన్మకొండలో విషాదం... పురుగుల మందు తాగి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య