గులాబీ గూటికి అనిల్ జాదవ్
మాజీ కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా? అవుననే సమాధానమే వినపడుతోంది.
మాజీ కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా? అవుననే సమాధానమే వినపడుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారు ఎక్కనున్నారు. ఈ నెల 20న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతల ఆద్వర్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అభివృద్దిపై శ్రధ్ద, దూరదృష్టి ఉన్న నేతగా సీయం కేసీఆర్ నేతృత్వంలో పని చేసేందుకు అనిల్ జాదవ్ నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న,బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, తదితరులు ఆయనతో సంప్రదింపులు జరిపారు.
టీఆర్ఎస్ పార్టీలో సముచితం స్థానం కల్పిస్తామని అనిల్ జాదవ్ కు భరసా లభించినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్లో చేరాలని అనిల్ జాదవ్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న అనిల్ జాదవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు.