ఈటల, కోమటిరెడ్డి లతో అమిత్ షా భేటీ... కేటీఆర్ కు అవకాశమివ్వని కేంద్ర హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ భేటీ రద్దయ్యింది. కేంద్ర మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా శనివారం రాత్రి జరగాల్సిన భేటీ రద్దయ్యింది.
న్యూడిల్లీ : తెలంగాఐ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి అమిత్ ను కలుసుకోలేపోయారు. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా వుండటంతో ఈ భేటీ రద్దయ్యింది. ఇతర కార్యక్రమాల్లో అమిత్ షా బిజీగా వుండటంతో కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆదివారం) తెలంగాణకు పయనమయ్యేందుకు సిద్దమయ్యారు.
హైదరాబాద్ లో రోడ్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూములు అడ్డంకిగా మారాయి. ఇందులో కేంద్ర హోంశాఖ భూములు కూడా వుండటంతో ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత మంత్రితో చర్చించాలని కేటీఆర్ భావించారు. అంతేకాదు విభజన చట్టంలోని అంశాలపైనా, కేంద్రం నుండి తెలంగాణకు దక్కాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా తో కేటీఆర్ భేటీ కావాలనున్నారు. కానీ అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనను కలవడం కేటీఆర్ కు కుదరలేదు.
తెలంగాణ బిజెపి నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో శనివారమే అమిత్ షా భేటీ అయ్యారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల బిజెపి నాయకులతోనూ అమిత్ షా సమావేశమయ్యారు. కానీ కేటీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చికూడా కలవకపోవడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కు రాజకీయాలపై వున్న శ్రద్ద పాలనపై లేదని... అందుకే పార్టీ నాయకులతో భేటీ అయి కేటీఆర్ కు సమయం ఇవ్వలేదని అన్నారు. కేటీఆర్ ను అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించి చివరకు అపాయింట్ రద్దు చేసి అవమానకరంగా వ్యవహరించారని బిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
Read More బీజేపీ బలోపేతమే లక్ష్యం .. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై విశ్వాసం వుంది : ఈటల , రాజగోపాల్ రెడ్డి
ఇదిలావుంటే రెండ్రోజుల డిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కేటీఆర్. శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ సమావేశమైన కేటీఆర్ రక్షణ శాఖ భూములు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్దికి ఎలా అడ్డంకిగా మారాయో వివరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు రక్షణశాఖ భూములు పెద్ద అడ్డంకిగా మారాయని... వెంటనే వారిటి జిహెచ్ఎంసికి బదలాయించాలని రక్షణమంత్రి రాజ్ నాథ్ ను కోరారు కేటీఆర్.
ఇక శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్తోపాటు బీఆర్ఎస్ ఎంపీలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్ల మేరకు, అలాగే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు అంటే సుమారు ఐదు కిలోమీటర్ల వరకు మెట్రోకు ఆమోదం, ఆర్థిక సహకారం చేయాలని కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం తరహాలోనే పట్టణ పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేటీఆర్ కేంద్ర మంత్రికి ప్రతిపాదన చేశారు.