తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా.. ఆ విషయంలో నేతలకు క్లాస్..?
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.తెలంగాణలో పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికపై అమిత్ షా వారితో చర్చిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన వేడుల్లో పాల్గొన్న అమిత్ షా.. అనంతరం బేగంపేట టూరిజమ్ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికపై అమిత్ షా వారితో చర్చిస్తున్నారు. ఈ సమేశంలో ఇటీవల బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ నేతలకు అమిత్ షా మార్గనిర్దేశనం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య సమన్వయ లోపంపై క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పార్టీలో చేరికలపై మరింత ఫోకస్ పెట్టాలని సూచించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక, బేంగపేట టూరిజమ్ ప్లాజాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కలిశారు. అయితే అమిత్ షాతో రాజకీయాలు చర్చించలేదని గోపిచంద్ తెలిపారు. దేశంలో క్రీడారంగం అభివృద్దిపై అమిత్ షాతో మాట్లాడినట్టుగా చెప్పారు. క్రీడల అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని అమిత్ షా చెప్పారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. అమిత్ షా హైదరాబాద్లొ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీసు అకాడమీకి వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు అమిత్ షా న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.