ఫోన్లు ట్యాప్ చేస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘పెగాసస్‌’ ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

పెగాసస్ వ్యవహారం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే పెగాసస్‌కు భయపడి ఏకంగా తన ఫోన్‌కి ప్లాస్టర్ వేసేశాని తెలిపారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దేశంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.

Also Read:నా ఫోన్‌ కెమెరాకి ప్లాస్టర్ వేశా.. పెగాసస్‌ వ్యవహారంపై మమత సంచలన వ్యాఖ్యలు

బాధ్యులపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘పెగాసస్‌’ ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ కోరారు. హ్యాకింగ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో గళం వినిపించడంతో పాటు క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని రేవంత్ వెల్లడించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌తో భేటీ అయిన రేవంత్‌ ఫోన్‌ హ్యాకింగ్‌కు నిరసనగా రేపు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని పేర్కొన్నారు.