తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆశా కార్యకర్తల జీతాలు పెంచామని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంగన్ వాడీలకు కూడా గౌరవపదమైన జీతం ఇస్తున్నామని తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లాలో నూతన ఆసుపత్రి భవనానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో మంత్రి హరీష్ రావు (harish rao) గురువారం పర్యటించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, విగ్రహ ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ (nirmal) జిల్లా కేంద్రంలో రూ. 40 కోట్లతో నిర్మించే నూతన జిల్లా ఆసుపత్రి భవనానికి ఆయన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (indrakaran reddy), ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి (vittal reddy), రేఖా నాయక్ (rekha nayak), ఎమ్మెల్సీ దండే విఠల్ (dande vittal), జిల్లా కలెక్టర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో 280 పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లా ప్రజలు కోరకుంటున్నట్టుగా త్వరలోనే ఈ ప్రాంతానికి మెడికల్, నర్సింగ్ కాలేజీ సీఎం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు, ఆశాలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. మూడో వేవ్ సమయంలో రాష్ట్ర హైకోర్టు, నీతి అయోగ్ కూడా తెలంగాణ వైద్య శాఖ పని తీరును మెచ్చకుందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆశా కార్యకర్తల జీతాలు చాలా తక్కువగా ఉండేవని మంత్రి హరీశ్ రావు తెలిపారు. చాలా సార్లు జీతాలు పెంచాలని రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసేవారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వాలు వారిని గుర్రాలతో తొక్కించాయని, ఇనుప కంచెలతో అడ్డుకున్నాయని చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత తాము జీతాలు పంచామని తెలిపారు. 2014 కంటే ముందు రూ. 1500 జీతం ఉంటే దానిని 6000 వేలకు పెంచారని, మళ్లీ అడగకుండానే 30 శాతం పెంచి ఇప్పుడు రూ. 9750 అందిస్తున్నామని తెలిపారు.
ఆశాలు మరింత బాగా పని చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో 27 వేల మందికి స్మార్ట్ ఫోన్లు అందించామని అన్నారు. ఒకపుడు ఆశాలంటే చిన్న చూపు ఉండేదని, కానీ ఇప్పుడు ఎంతో గౌరవం పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. డెలివరీ విషయంలో ఆశాలు మరింత దృష్టి సారించాలని చెప్పారు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత రెగ్యులర్ గా చెకప్స్ చేయించాలని సూచించారు. రక్త హీనత బారి నుంచి గర్భిణులను కాపాడాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని సూచించారు. సాధారణ డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలని అన్నారు. సాధారణ ప్రసవాలు జరిగితే పుట్టిన బిడ్డకు గోల్డెన్ అవర్ లో తల్లి పాలు అందుతాయని, ఇలా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందిరిపై ఉందని అన్నారు.
తెలంగాణలో బీపీలు, షుగర్ లు పెరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో చాలా మందికి అవగాహన లేక మందులు వేసుకోవడం లేదని తెలిపారు. అయితే వీరిపై శ్రద్ధ వహించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీల ను ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోందని తెలిపారు. 2014లో అంగన్ వాడీలకు జీతం రూ. 4200 ఉండేదని, అయితే ఇప్పుడు వారు రూ. 13,650 జీతం అందుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే అంగన్ వాడీలకు అత్యధిక జీతం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణానే అని తెలిపారు. తెలంగాణలో మందుల కొరత ఉండదని, అలా కొరత ఉందంటే డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో మెడికల్ బడ్జెట్ పెంచామని, పేదలకు వైద్యం భారం కాకుండా చూసుకుంటామని తెలిపారు. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు అయితే తెలంగాణ వచ్చిన తరువాత స్వల్ప వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని అన్నారు.
