అత్యాచార బాధితురాలి ఇంటర్వ్యూ: తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది టి. అరుణకుమారి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్: క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది టి. అరుణకుమారి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.
తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళతో తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేశాడు.క్యూ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను మల్లన్న ఇంటర్వ్యూ పేరుతో వేసిన ప్రశ్నలపై న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఇంటర్వ్యూలో నవీన్ అన్ని రకాల హద్దులను దాటారని ఆ వినతిపత్రంలో బాధితురాలి న్యాయవాది చెప్పారు.సైకో మాదిరిగా ఇంటర్వ్యూ చేశారన్నారు.
గత ఏడాదిలో షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ ఎన్ కౌంటర్ బూటకమని ఆయన చేసిన వ్యాఖ్యలను అరుణకుమారి తప్పుబట్టారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లను రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్ కు చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.