అచ్చంపేట ఆసుపత్రి ఘటనలో ట్విస్ట్: 'వారిద్దరే చేశారు'
అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో స్వాతి డెలీవరీ సమయంలో చోటు చేసుకొన్న ఘటనపై డాక్టర్ సుధారాణి సంచలన విషయాలను బయట పెట్టారు.
అచ్చంపేట:నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో స్వాతి అనే వివాహితకు డెలీవరీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.
Also read:అచ్చంపేట శిశువు మరణంపై సర్కార్ సీరియస్: ఇద్దరు వైద్యుల సస్పెన్షన్.
ఈ నెల 20వ తేదీన అచ్చంపేట ఆసుపత్రిలో డెలీవరీ కోసం వచ్చిన స్వాతికి ఆపరేషన్ చేసే సమయంలో తల లేని శిశువు బయటకు వచ్చింది. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిపై దాడికి దిగిన విషయం తెలిసిందే.
Also Read:అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ తారాసింగ్, డ్యూటీ డాక్టర్ సుధారాణిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ ఘటనపై అచ్చంపేట పోలీసులు కూడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే డాక్టర్ సుధారాణి ఈ కేసు విషయమై బాంబు పేల్చారు.ఈ ఘటన జరిగిన రోజున తాను కూడ విధుల్లో ఉన్నట్టుగా ఆమె చెప్పారు. ఈ నెల 20వ తేదీన తనకు తెలియకుండానే ఆపరేషన్ చేశారని ఆమె ఆరోపించారు.ఈ విషయమై ఆమె ఓ మీడియా ఛానెల్తో మాట్లాడారు..
డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సిరాజ్లు చేసిన పనికి తాను శిక్షను అనుభవిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ విషయం జరిగిన విషయం తనకు తెలియదని ఆమె తెలిపారు.
ఈ నెల 20వ తేదీన స్వాతికి డెలీవరి చేస్తున్న సమయంలో శిశువు తల బయటకు వచ్చింది. మిగతా శరీరం స్వాతీ గర్భంలోనే ఉండిపోయింది. వెంటనే ఆమెను హైద్రాబాద్ పేట్లబురుజు ఆసుపత్రికి తరలించారు. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. ఆమె గర్భంలో ఉన్న శిశువు మృత శరీరాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం స్వాతి పేట్ల బురుజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
అసలు స్వాతికి డెలీవరి చేసే సమయంలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.