వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచన
వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వేగంగా కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది.
వడ్ల కొనుగోలు విషయంలో ఇటీవల జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ విషయం పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. ఎంపీ కేషవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ నుంచి వానాకాలానికి సంబంధించిన వరి ధాన్యం ఎంత వచ్చిన కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కావాలనే రాద్ధాతం చేస్తుందని మండిపడ్డారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. వడ్ల కోనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
కొనుగోళ్లు జరగక రైతుల ఆత్మహత్యలు..
వడ్ల కొనుగోళ్లు నిర్వహించకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఓ న్యాయశాస్త్ర విద్యార్థి కోర్టులో ప్రయోప్రయోజిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరకే దళారీలకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీని వల్ల దళారీలు లబ్ది పొందుతున్నారని, కానీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులను రక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము చట్టాల ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుందని చెప్పింది. చట్టాలు రూపొందించాల్సింది తాము కాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కచ్చితంగా వడ్లు కొనాలని ఎక్కడా లేదని చెప్పారు. కాబట్టి ఈ చట్టం కింద ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ను ప్రశ్నించింది. మద్దతు ధర విషయంలో ఎలాంటి చట్టం లేదని చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా వడ్ల కొనుగోలుకు అవసరమైన దారులు వెతకాలని, వేగంగా రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించింది.
27.07 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం- ప్రభుత్వం
తెలంగాణ రైతాంగం నుంచి ఇప్పటికే 27.07 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలంగాణ ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వానాకాలంలో పండిన పంట మొత్తం కొంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రూ.2,800 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 6439 కేంద్రాలను ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే నెల 22వ తేదీ వరకు వరి ధాన్యం సేకరిస్తామని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వేసిన ఈ పిటిషన్ పరిపూర్ణమైనది కాదని అన్నారు.