జమ్మికుంటలో విషాదం: ధాన్యం కొనుగోలు రాజకీయానికి మరో రైతు బలి?
పండించిన ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుంటే టెన్షన్ కు లోనయి ఓ రైతు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరినొకరు తిట్టుకుంటూ, మీదంటే మీదే తప్పని ఆరోపించుకుంటున్నాయి. ఇలా టీఆర్ఎస్, బిజెపి (TRS, BJP) ప్రభుత్వాల రాజకీయాలతో నలిగిపోతున్న రైతులు చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా తాజాగా హుజురాబాద్ (huzurabad) నియోజవర్గ పరిధిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.
జమ్మికుంట (jammikunta) మున్సిపాలిటీ పరిధిలోని అబాది జమ్మికుంటలో ఐలయ్య అనే రైతు గుండెపోటుతో మరణించారు. అయితే అతడి పండించిన వరి ధాన్యాన్ని (paddy) అమ్మడానికి 20 రోజులుగా ప్రయత్నిస్తున్నాడట. అయినప్పటికి వడ్లను కొనకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయి గుండె పోటుకు గురయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలకు మధ్య సాగుతున్న వివాదానికి రైతులు బలవుతున్నారు. ఇటీవల కామారెడ్డి (kamareddy) జిల్లాలో సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఓ రైతు ఇలాగే ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే కన్నుమూశాడు. రాజయ్య అనే రైతు ధాన్యం కుప్ప పోస్తున్న సమయంలో గుండెపోటుకు గురయి మరణించాడు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రాజయ్యకు గుండెపోటు రావడంతో తాను పండించిన పంటపైనే పడి ప్రాణాలు వదిలాడు.
read more TRS: పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్.. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందంటూ ఫైర్..
ఇదే కామారెడ్డి జిల్లాలో మరో రైతుకూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. లింగంపేట మండలానికి చెందిన బీరయ్య అనే రైతు ఐకేపీ (IKP) కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. తన వంతు కోసం ఎదురు చూస్తూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయి మరణించాడు. ధాన్యం కొనుగోలు ఆలస్యమవడంతో తీవ్ర ఆందోళనకు గురయి భీరయ్య మరణించినట్లు స్థానిక రైతులు తెలిపారు.
ఇక, వరి కొనుగోళ్ల (Paddy Procurement )కు సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణ (Telangana)లో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామంటూ అధికార టీఆర్ఎస్ ధర్నాకు దిగింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కేసీఆర్ డిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ ఎంపీలు అటు రాజ్యసభ, ఇటు లోక్ సభ లోపల, వెలుపల నిరసన గళం వినిపిస్తున్నారు. ఇవాళ(మంగళవారం) కూడా లోక్సభలో స్పీకర్ పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అనంతరం లోక్సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్ఎస్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ కే కేశవరావు (K Keshava Rao) ప్రకటించారు. డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలకు తమ ఎంపీలు హాజరు కాబోరని చెప్పారు.