Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు: భారీగా ఆస్తుల గుర్తింపు

హైద్రాబాద్ శంషాబాద్ లో  పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి ఇంట్లో భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ACB Raids Retired Panchayat Officer Surender Reddy House in Shamshabad
Author
Hyderabad, First Published May 12, 2022, 11:22 AM IST

హైదరాబాద్:నగరంలోని Shamshabadలో  సంగారెడ్డి మండల  పంచాయితీ అధికారి Surendar Reddy ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

సురేందర్ రెడ్డిపై ఉన్న ఆరోపణలపై ACB అధికారులు సోదాలు నిర్వహించారు.  ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డి ఇంట్లో సుమారు కోటి రూపాయాల నగదును కూడా డబ్బులు సీజ్ చేశారని సమాచారం. సురేందర్ రెడ్డి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. కోటి రూపాయాల విలువైన విల్లా, రూ. 43.80 లక్షల ఓపెన్ ప్లాట్, రూ. 8.11 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 129.2 తులాల గోల్డ్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారని సమాచారం. శంషాబాద్ లో పంచాయితీ అధికారిగా పనిచేసిన సురేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టుగా పలుఆరోపణలున్నాయి. 

ఎంపీవో సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా తమకు సమాచారం వచ్చిందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. హైద్రాబాద్ అల్వాల్ నివాసంలో రూ. 2.31 కోట్లు గుర్తించామన్నారు. సురేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ఆస్తుల విలువ  రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని ఆయన చెప్పారు.సురేందర్ రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డిలో పంచాయితీ అధికారిగా పనిచేస్తున్నారు.గతంలో శంషాబాద్ లో సురేందర్ రెడ్డి పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారని  డీఎస్పీ వివరించారు. ఎస్బీఐ బ్యాంకులో సురేందర్ రెడ్డి  బావ మరిది బినామీగా రెండు ఆస్తులను గుర్తించామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ వివరించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో  పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం నాడు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. శంషాబాద్ నుండి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి  సురేందర్ రెడ్డిని తరలించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఈ నెల 2న ఇద్దరు  అధికారులపై ఏసీబీ  కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ తహసీల్దార్ తో పాటు సూర్యాపేట జిల్లాలోని పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్  ఇళ్లలో  ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.  

పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  విల్లాలు, ప్లాట్లు, వావానాలు, ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కరుణాసాగర్ ఇంట్లో రూ. 25 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్పారు.

హైద్రాబాద్ శేరిలింగంపల్లి  సిటీ ప్లానర్ రాములుపై ఏసీబీ  ఇటీవలనే కేసు నమోదు చేసింది. రాములుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. 20 చోట్ల ఆస్తులు, రెండున్నర కిలోల బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీస్‌లో పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడినట్లుగా గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.40 కోట్ల పైచిలుకు ఆస్తులు వున్నట్లు తేలింది. గురువారం ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల రాములు నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

టౌన్‌ ప్లానింగ్‌  అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ ఫిర్యాదులు అందడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టింది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ ఏడాది మార్చిలోరామగుండం ఆర్డీవో  శంకర్ కుమార్‌పై ఆదాయానికి మంచిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన  ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో శంకర్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.ఆయనను రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు. 

2020లో కోవిడ్  నివారణ కొరకు వీధులలో వెదజల్లిన హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీకి సంబంధించిన బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ రజనీకాంత్ వద్ద శంకర్ కుమార్ రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం కార్పోరేషన్ ఇంచార్జి కమిషనర్‌గానూ, పెద్దపల్లి ఆర్డీవో గానూ శంకర్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ రజనీకాంత్ బిల్లుల చెల్లింపు కోసం మద్యవర్తి ద్వారా రూ.లక్ష డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

అధికారుల సలహా మేరకు ఆర్డీవో డిమాండ్ చేసిన లంచం డబ్బును మద్యవర్తిగా ఉన్న ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్‌కు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  పట్టణ ప్రగతిలో భాగంగా హైడ్రోక్లోరైడ్ ద్రావణం సరఫరాకు సంబంధించిన బిల్లులో సుమారు రూ.9 లక్షల 25వేల చెల్లించాల్సి ఉండగా, రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.  ఇటీవల కాలంలో తెలంగాణలో అవినీతి అధిాకారులపై ఏసీబీ అధికారులు సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios