మాదాపూర్లో బోర్డు తిప్పేసిన డన్యోన్ ఐటీ కంపెనీ.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..
ఉద్యోగ అవసరం ఉన్న పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ ఐటీ కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉద్యోగ అవసరం ఉన్న పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ ఐటీ కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మాదాపూర్లోని డన్యోన్ ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు కంపెనీని సంప్రదించారు. అలా తమతో టచ్లో వచ్చినవారికి కంపెనీ ప్రతినిధులు ఫోన్ ద్వారానే ఇంటర్వ్యూ చేశారు. అనంతరం వారికి ఆఫర్ లెటర్ జారీ చేశారు. ఒక్కోక్కరికి నాలుగు లక్షల రూపాయలంతో ప్యాకేజ్ ప్రకటించింది.
ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు కంపెనీ ప్రతినిధులు దండుకున్నారు. ఇలా దాదాపు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్టు ఇస్తామంటూ కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. రోజులు గడుస్తున్న కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో... మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కంపెనీ ప్రతినిధు ప్రతాప్ పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.