ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో 60 మంది సర్పంచుల ఆత్మహత్య.. : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి
Hyderabad: బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అనీ, కేసీఆర్ కు ప్రజలు త్వరలోనే తగిన బుద్ది చెబుతారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిమాలిన చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు.
TPCC president A Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై విమర్శల దాడిని కొనసాగించారు. బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అనీ, కేసీఆర్ కు ప్రజలు త్వరలోనే తగిన బుద్ది చెబుతారని విమర్శలు గుప్పించారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిమాలిన చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల నిధులు పక్కదారి పట్టకుండా, సర్పంచుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 60 మంది సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
సర్పంచ్ల దుస్థితిని ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పంచాయతీలకు చెందిన ₹ 35,000 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (కేసీఆర్) నేతృత్వంలోని ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. "గ్రామానికి సర్పంచ్ని ప్రథమ పౌరుడిగా గౌరవిస్తారు. తెలంగాణలో (రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల) 60 మంది సర్పంచ్లు (ఒత్తిడితో) ఆత్మహత్యలకు పాల్పడ్డారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్ల ఖాతాల్లో జమ చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించిన ఆయన.. కొందరు ప్రజాప్రతినిధులైన సర్పంచులు తమ సొంత డబ్బును వడ్డీలకు తీసుకుని తమ గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేశారని తెలిపారు. రెండు, మూడేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో కొందరు తమ జీవితాలను ముగించుకోగా, మరికొందరు తమ భార్యలకు మంగళసూత్రాలను సైతం తాకట్టు పెట్టారని ఆరోపించారు.
పార్టీ మారిన నేతలపై ఫిర్యాదుతో బీఆర్ఎస్ పై పోరు..
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ ను వీడటం, కేసీఆర్ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పోరాటానికి దిగింది. ఈ క్రమంలోనే మొయినాబాద్ పోలీసులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరిప్రియ బానోత్, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాంతారావు రేగా, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, వనమా వెంకటేశ్వరరావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. జజాల సురేందర్, గండ్ర వెంకట రమణారెడ్డి, రోహిత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు విధేయులుగా మారారు.
2018 ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ప్రారంభించారని రేవంత్ ఆరోపించారు. ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడానికి బదులుగా అనవసరమైన ప్రయోజనాలను పొందారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు డబ్బు ప్రయోజనాలు, పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లుల క్లియరెన్స్, భూ వివాదాల పరిష్కారం, వారి కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రయోజనాలు లభించాయని ఆయన ఆరోపించారు. అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేలా ప్రేరేపించేందుకు బీజేపీ అనుసరించిన విధానాలు ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులు, ఇతర ఉన్నత కేంద్ర ప్రభుత్వ పదవులకు సంబంధించినవేనని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా ప్రతినిధులకు పార్టీల వారీగా లంచాలు ఇవ్వడం, తద్వారా వారిని ఫిరాయింపులకు ప్రేరేపించడం వెనుక ఉన్న పూర్తి నేరపూరిత కుట్రను దర్యాప్తు చేసి వెలికితీయాలని ఆయన దర్యాప్తు సంస్థను డిమాండ్ చేశారు.