హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు గత నెల తనిఖీలు చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం కింద 4,321 మందిపై చార్జిషీటు ఫైల్ చేశారు. ఇందులో 400 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనులపై నజర్ పెట్టారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయగా.. చాలా మంది వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. జూన్ నెలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 4,321 మందిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల నేరాల కింద చార్జిషీటు దాఖలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం కింద కోర్టు 400 మందికి జైలు శిక్ష, జరిమానా విధించింది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూన్ నెలలో 4,321 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 400 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. కాగా, ఇతరులకు కేవలం జరిమానా విధించింది. మరికొందరికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించారని 44 మంది లైసెన్స్‌లు రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీసులు.. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి లేఖ రాశారు.

ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ తనిఖీలు చేపడుతున్నారు. ‘మద్యం సేవించి వాహనం నడిపేవారిని నియంత్రించడానికి రాత్రి పూట 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య హైదరాబాద్‌లోని పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూట కూడా రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించడం కొనసాగిస్తారు’ అని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జీ సుధీర్ బాబు తెలిపారు.

Also Read: బీజేపీతో చర్చలు జరిపాం.. కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదు - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

మద్యం సేవించి వాహనం నడిపిన వారందరినీ గోషామహల్, బేగంపేట్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌‌లో కౌన్సెలింగ్‌కు రప్పించారు. 

400 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఒక్కో తీవ్రతతో జైలు శిక్షలు విధించింది. ఇద్దరికి ఏడు రోజుల జైలు శిక్ష, ఐదుగురు ఆరు రోజులపాటు, 32 మంది ఐదు రోజులపాటు, 61 మందికి 4 రోజులపాటు, 131 మందికి మూడు రోజులపాటు, 162 మందికి రెండు రోజులు, ఏడుగురికి ఒక్క రోజు జైలు శిక్ష విధించింది.