హేమంత్ పరువు హత్య.. 39 పేజీల ఛార్జిషీటు దాఖలు
హేమంత్ అనే యువకుడిని అతని భార్య బంధువులు అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఈ పరువు హత్యకు సంబంధించి.. 39పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో.. హేమంత్ అనే యువకుడిని అతని భార్య బంధువులు అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఈ పరువు హత్యకు సంబంధించి.. 39పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో జరిగిన వార్షిక క్రైమ్ మీటింగ్లో డీసీపీ మాట్లాడారు. హేమంత్-అవంతికారెడ్డి ప్రేమవివాహం ఇష్టంలేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పథకం ప్రకారమే హేమంత్, అవంతిలను బయటకు రప్పించారు. అనంతరం సుపారీ కిల్లర్స్తో హేమంత్ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు.
ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు 18మంది నిందితులను అరెస్టు చేశారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కేవలం 86 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశామని పీఆర్సీ నంబర్ 149/2020 వచ్చిందని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫాస్టుట్రాక్ కోర్టులో 2021 జనవరి-1న ఈ కేసు ట్రయల్కు రానున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులకు తప్పనిసరిగా శిక్షపడేలా సాక్ష్యాధారాలను సమర్పించినట్లు డీసీపీ పేర్కొన్నారు.