Hyderabad Accident : హైదరాబాద్ శివారులో ఆర్టిసి బస్సు బోల్తా... 20 మందికి గాయాలు
ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టిసి బస్సు రోడ్డు ప్రమాదానికి గురవడంతో 20 మంది గాయపడ్డారు.
![20 People injued in road accident in Hyderabad outskirts AKP 20 People injued in road accident in Hyderabad outskirts AKP](https://static-ai.asianetnews.com/images/01g2rhpytgfzbrqve77excq5fc/pjimage--5-_363x203xt.jpg)
రంగారెడ్డి : హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై వేగంగా వెళుతూ ఒక్కసారిగా అదుపుతప్పిన ఆర్టిసి బస్సు బోల్తాపడింది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్ తో సహా 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ రోడ్డుప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మీదుగా హైదరాబాద్ కు ప్రయాణికులను తీసుకువెళుతుందో ఆర్టిసి బస్సు. జాతీయ రహదారి 44పై వేగంగా వెళుతుండగా సడన్ గా ఏమయ్యిందో తెలీదు బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అటువైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో హైవేపై వాహనాల రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆర్టిసి సిబ్బందితో పాటు బస్సులోని ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలైన వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. సమయానికి వైద్యం అందడంతో గాయపడినవారందరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం.
Read More Hyderabad ఆదిభట్ల వద్ద కారులో మంటలు: కోదాడకు చెందిన వెంకటేష్ సజీవ దహనం
అయితే బస్సు హైవేకు అడ్డంగా బోల్తాపడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.