మెదక్ జిల్లా రామాయం పేటకు చెందిన గంగం పద్మ, ఆమె కుమారుడు గంగం సంతోష్.. కామారెడ్డిలోని ఓ లాడ్జిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.
మెదక్ జిల్లా రామాయం పేటకు చెందిన గంగం పద్మ, ఆమె కుమారుడు గంగం సంతోష్.. కామారెడ్డిలోని ఓ లాడ్జిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ బుధవారం కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. దీంతో పోలీసులు నిందితులను నిజామాబాద్ జైలుకు తరలించారు. నిందితు విచారణకు అనుమతి కోరుతూ రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ యాదగిరి, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, స్వరాజ్, పృథ్వీ రాజ్లు మంగళవారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయారు. బుధవారం వారిని కోర్టుకు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి కరోనాతోపాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.
పద్మ, సంతోష్లు ఇటీవల కామారెడ్డిలోని లాడ్జ్లో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాము ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.
‘శ్రీను అనే వ్యక్తితో కలిసి నేను వ్యాపారం చేశాను. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో.. ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్కు పిలిచారు. నా ఫోన్ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు’ అని సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు.
మున్సిపల్ చైర్మన్తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారని.. ఏడాది పాటు తనను వేధించారని చెప్పాడు. తన వ్యాపారం జరగకుండా చేశారని సంతోష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను అర్థికంగా నష్టపోయానని.. అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నాడు. వీడియోలో తల్లి, కొడుకులు కన్నీరు పెట్టుకుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో కన్నీరు పెట్టించేలా ఉంది.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరణ వాంగ్మూలం మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేయడం సరికాదని అంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్షం మంగళవారం రామాయంపేట బంద్ చేపట్టాయి.
