మాన్ సూన్ ఆఫర్ ప్రకటించిన జియో
వర్కింగ్ కండీషన్లో ఉన్న పాత ఫీచర్ ఫోన్ను ఇచ్చేసి జియో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే కేవలం రూ.501 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రముఖ టెలికాం సంస్థ జియో మాన్ సూన్ సేల్ కి తెరలేపింది. ఈ నెల మొదటి వారంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ మాన్ సూన్ సేల్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జియోస్టోర్లు, అధికారిక రిటైల్ పార్టనర్ల వద్ద ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. వర్కింగ్ కండీషన్లో ఉన్న పాత ఫీచర్ ఫోన్ను ఇచ్చేసి జియో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే కేవలం రూ.501 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రూ.501 కూడా మూడేళ్ల తర్వాత ఫోన్ ఇస్తే వంద శాతం తిరిగిస్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచే ఈ ఆఫర్ జియో స్టోర్స్లో ప్రారంభమైంది. శనివారం నుంచి మిగిలిన పార్ట్నర్ స్టోర్స్లో కూడా ఈ ఆఫర్ మొదలవుతుంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఓ రీచార్జ్ ప్లాన్ను కూడా జియో ప్రకటించింది. 2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీ ఆధారంగా పాత ఫోన్లను తీసుకుంటామని జియో చెప్పింది.
అయితే కస్టమర్లు తెచ్చిన పాత ఫోన్లు కచ్చితంగా పనిచేసేలా ఉండాలి. విరిగిన, కాలిన, కొన్ని విడిభాగాలు పోయిన ఫోన్లను తీసుకోరు. పైగా చార్జర్ కూడా కచ్చితంగా ఉండాలి. 2015, జనవరి 1 తర్వాత అమ్మిన ఫోన్లను మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలాంటి కస్టమర్లకు రూ.501 తీసుకొని కొత్త జియో సిమ్తోపాటు జియో ఫోన్ ఇస్తారు. ఒకవేళ పాత నంబరే కావాలంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. కొత్త రీచార్జ్ ప్లాన్ కింద రీచార్జ్ చేసుకోవచ్చు.
స్పెషల్ జియో ఫోన్ రీచార్జ్ ఆఫర్
మాన్సూన్ హంగామా ఆఫర్ కిందట ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ఆఫర్ను కూడా జియో ఇస్తున్నది. రూ.594 చెల్లిస్తే ఆరు నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్, డేటా ఇస్తారు. దీనికితోడు పాత ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్లకు రూ.101 విలువైన 6 జీబీ డేటా వోచర్ను ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ లెక్కన మొత్తంగా ఆరు నెలలకు 90 జీబీ డేటా వస్తుంది. ఇక కొత్తగా రూ.99 రీచార్జ్ ప్లాన్ను కూడా జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 టెక్ట్స్ మెసేజ్లు ఇస్తారు.