Asianet News TeluguAsianet News Telugu

గూగుల్, జూమ్ యాప్‌లకు పోటీగా... వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ వేళ మరో అనుకూల ఫీచర్ జత చేయనున్నది. ఇప్పటి వరకు నలుగురికి మాత్రమే పరిమితమైన ఆడియో, వీడియో ఫీచర్ స్థానే అంతకు మించిన వ్యక్తులు మాట్లాడుకునే ఫీచర్ అందుబాటులోకి తేనున్నది. తద్వారా గూగుల్ యాప్, జూమ్ యాప్‌లతో పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది వాట్సాప్.

WhatsApp prepares to increase the group video and audio call limit
Author
Hyderabad, First Published Apr 18, 2020, 3:43 PM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను తేనున్నది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న వాట్సాప్.. కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో మరో ఆసక్తికర ఫీచర్‪ను జోడించనుంది. 

వీడియో, ఆడియో కాలింగ్ లో పాల్గొనే  యూజర్ల పరిమితిని పెంచడానికి  వాట్సాప్ సన్నాహాలు చేస్తోందని మీడియాలో వార్తలొచ్చాయి.  గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్‌‌కు భారీగా ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేలా  ప్రయత్నాలను వేగవంతం చేసింది. 

డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌ వంటి ఫీచర్లను వాట్సాప్ అందించింది. తాజాగా గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్  పరిమితిని పెంచేందుకు వాట్సాప్ యోచిస్తోంది. తద్వారా టెక్ దిగ్గజం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డియో, చైనాకు చెందిన జూమ్ లాంటి యాప్స్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. 

కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తుండగా వీడియో కాలింగ్ సదుపాయానికి డిమాండ్ బాగా పెరిగింది. గ్రూపు ఆడియో, వీడియో కాలింగ్ వైపు మళ్లిన తరుణంలో వాట్సాప్ ఈ కీలక మార్పును తేవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

లాక్ డౌన్ కాలంలో జూమ్, గూగుల్ డియో యాప్స్ లో ఒకేసారి డజన్ల కొద్దీ వ్యక్తులతో వీడియో కాలింగ్‌ను అనుమతి లభిస్తోంది. దీంతో వాట్సాప్  తాజా అప్ డేట్ తీసుకురానుంది. ప్రస్తుతానికి గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్‌లో పాల్గొనడానికి నలుగురి మాత్రమే అనుమతి ఉంది.

ఇపుడు ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది, ఎప్పటినుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

also read  జియో అద్భుతమైన ఆఫర్: రూ.199కే 1000 జీబీ డేటా...

దీంతోపాటు ఆండ్రాయిడ్ వీ2.20.129 కోసం వాట్సాప్ బీటాలో ఇప్పటికే అందుబాటులో ఉన్ కొత్త కాల్ హెడర్‌ను జోడించడానికి కూడా వాట్సాప్ పనిచేస్తోంది. తద్వారా వాట్సాప్ కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అని చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

కోవిడ్-19 మహమ్మారితో లాక్‌డౌన్‌ అయిన ప్రజలు సోషల్ మీడియాకు అంకితమవుతున్నారు. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో, రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించడతో అటు  ఉద్యోగులు కూడా ఇంటినుంచే తమ సేవలను అందిస్తున్నారు. 

దీంతో వివిధ సంస్థలు తమ ఉద్యోగులతో అనుసంధానం అయ్యేందుకు, ఆన్ లైన్ తరగతులకు గ్రూపు వీడియో, లేదా వీడియో కాన్ఫరెన్సుల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, విద్యార్థులు... ఇలా ఎవరికి వారు తమ పనులను, ముచ్చట్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పూర్తి చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వీడియో కాల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 

మెసేజింగ్‌కు బాగా అలవాటుపడ్డ వాట్సాప్‌లో వీడియో కాల్‌ అంత ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే అందులో ఒక్కసారి కేవలం నలుగురు మాత్రమే మాట్లాడుకునే వీలుంది. 

ఇప్పుడు ఆ పరిమితిని వాట్సాప్‌ పెంచబోతోంది. నలుగురుకు మించి ఎక్కువ మంది వాట్సాప్‌ వీడియో గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకునేలా మార్పులు చేస్తోంది.

అయితే పరిమితిని ఎంతకు పెంచుతున్నారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌ వాడుతున్న వినియోగదారుల్లో కొంతమందికే ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకు రానున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios