పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనను ప్రపంచానికి తెలియకుండా నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించింది. దీనివల్ల రోజుకు తమకు రూ.57.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని టెలికం సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్‌ను నిలిపివేయడం వల్ల టెలికం నెట్‌వర్క్‌ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయం కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రూ.2.5 కోట్ల చొప్పున రోజుకు రూ.57.5 కోట్ల నష్టపోతున్నట్టు సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ శుక్రవారం తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read ఇది పాపులిస్ట్ చట్టం మాత్రమే కాదు...ఫాసిస్టు చట్టం...

సీవోఏఐలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సభ్యులుగా ఉన్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోనలు మరింత పెరగకుండా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో 24 గంటలు ఇంటర్నెట్‌ నిలిపి వేశారు. దీంతో టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా వదంతులు వ్యాప్తిచెందడాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వ వర్గాల విశ్లేషణ.

భారతదేశంలో సగటు ఇంటర్నెట్‌ వినియోగం నెలకు 10 జీబీ ర్యామ్‌గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే సుమారుగా గంటకు రెండున్నర కోట్లుగా తేలిందని రాజన్‌ వివరించారు. 

also read ఐదు కెమెరాలతో హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్....

మరోవైపు సీఏఏపై వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరచూ నెట్‌ సేవలను నిలిపివేయడంపై నెట్‌ ప్రియులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్‌ కూడా ప్రాథమిక హక్కేనని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును వారు ఉటంకిస్తున్నారు.