తమిళనాడు పోల్స్: అభ్యర్ధులను ప్రకటించిన ఎంఎన్ఎం, కమల్ పోటీ ఇక్కడి నుంచే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా వున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలతో పొత్తులు కుదరడంతో అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా వున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలతో పొత్తులు కుదరడంతో అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీధి మైయమ్ (ఎంఎన్ఎం) శుక్రవారం తన జాబితాను ప్రకటించింది. 234 స్థానాలకు 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేస్తుండగా, మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే), ఇందియ జయనాయగ కట్చి చెరో 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.
ఎంఎన్ఎం అధినేత కమల్హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇక తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్హాసనేనని ఏఐఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు.
చెన్నై నుంచి కమల్ హాసన్ పోటీ చేయనున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ కమల్ కోయంబత్తూరు నుంచి బరిలో నిలుస్తున్నట్లు ఎంఎన్ఎం ప్రకటించింది.
అంతకుముందు ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం 173 మంది అభ్యర్ధులతో తమ తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు, యువజన విభాగం నేత, సినీహీరో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు