ExitPolls: డీఎంకే ప్రభంజనం... చేతులెత్తేసిన అన్నాడీఎంకే కూటమి, స్టాలిన్కే తమిళనాడు పగ్గాలు..?
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన రాష్ట్రం తమిళనాడు. ఈ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన రాష్ట్రం తమిళనాడు. ఈ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్ని స్టాలిన్కే అత్యధిక ఆధిక్యం రానున్నట్లు ప్రకటించాయి. ఇక టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కేవలం రెండు నుంచి నాలుగు స్థానాల్లో గెలుపొందే అవాకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి.
అయితే, మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చున్న డీఎంకే మాత్రం ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తాజా సర్వేల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీలో దిగారు. ఈ స్థానం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్టాలిన్, హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇండియా టుడే సర్వే:
డీఎంకే కూటమి: 175-195
అన్నాడీఎంకే కూటమి: 38-54
ఎంఎన్ఎం: 1-2
ఇతరులు : 1-7
న్యూస్ 18 సర్వే:
డీఎంకే కూటమి: 160-170
అన్నాడీఎంకే కూటమి: 58-64
ఇతరులు : 4-6
టుడేస్ చాణక్య సర్వే:
డీఎంకే కూటమి: 164-186
అన్నాడీఎంకే కూటమి: 46-68
ఏబీపీ న్యూస్ సర్వే:
డీఎంకే కూటమి: 160-172
అన్నాడీఎంకే కూటమి: 58-70
ఇతరులు: 0-7
రిపబ్లిక్- సీఎన్ఎక్స్ సర్వే:
డీఎంకే కూటమి: 160-170
అన్నాడీఎంకే కూటమి: 58-68
మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే ల మధ్యనే నెలకొని ఉంది.
డీఎంకే కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉండబోతున్నట్టుగా ముందు నుండే ఒపీనియన్ పోల్స్ పేర్కొన్నాయి.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో నిజమైన విజేత ఎవరో తేలాలంటే మాత్రం మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే..!