Asianet News TeluguAsianet News Telugu

ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు కేరళ నుంచి ఖతార్‌కు.. ఫోర్ వీలర్‌పై ఒంటరిగా ఓ మహిళ సాహస యాత్ర

FIFA World Cup 2022: ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ఫిఫా వరల్డ్ కప్ వచ్చే నెలలో  ఆరంభమవుతుంది. ఖతార్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ ను చూసేందుకు ఓ మహిళ సాహస యాత్ర చేపట్టింది. 

Woman From Kerala Drive to Mahe to Qatar For  Watch FIFA world Cup 2022
Author
First Published Oct 20, 2022, 5:23 PM IST

నేటికి సరిగ్గా నెలరోజుల్లో ఫుట్‌బాల్  ప్రపంచకప్ (ఫిఫా) ప్రారంభం కానున్నది. ఖతార్ వేదికగా సాగబోయే ఈ మెగా ఈవెంట్.. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగాల్సి ఉంది. ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే యూరోపియన్ దేశాలతో పాటుగా ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఈ టోర్నీకి ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్నారు.  కేరళకు చెందిన నాజి నౌషి మాత్రం  వీళ్లందరి కంటే కాస్త ప్రత్యేకం. పెళ్లి అయి ఓ బిడ్డకు తల్లైనా.. నాజి మాత్రం కేరళ నుంచి ఖతార్ వరకూ  ఫోర్ వీలర్ లో  వెళ్లి మ్యాచ్ లను చూడాలని  ఆరాటపడుతున్నది. ఆ మేరకు ఆమె ప్రయాణం కూడా ప్రారంభించింది. 

సంప్రదాయకంగా దేశంలో మిగిలిన రాష్ట్రాలైతే క్రికెట్ ఫీవర్ తో  ఉంటే  కేరళ మాత్రం ఇందుకు బిన్నంగా ఉంటుంది. అక్కడ క్రికెట్ కంటే ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే అభిమానులు చాలా మంది ఉన్నారు. వారిలో నాజి  నౌషి కూడా ఒకరు. 

కన్నూరు జిల్లాలోని మహే (మయ్యాళి)కు చెందిన నౌషి ఒక ట్రావెలర్. యూట్యూబర్ కూడా. ఆమె కు ప్రయాణాలంటే ఇష్టం.  చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నా  తన ఆసక్తిని మాత్రం వదులుకోలేదు.  లడక్, లేహ్, ఎవరెస్ట్ కు ప్రయాణాలు చేసింది. ట్రావెలింగ్ తో పాటు నౌషికి ఫుట్‌బాల్ అంటే కూడా ఇష్టం.  కాదు.. అంతకుమించి. ఆమె అర్జెంటీనా జట్టుకు వీరాభిమాని. ఆ జట్టుకు చెందిన లియోనల్ మెస్సీ అంటే పిచ్చి.  

ఫుట్‌బాల్ మీద ఆమెకు ఉన్న ప్రేమే.. ఆమె ఈ కొత్త ప్రయాణానికి నాంది పలికింది.  ఫిఫా  ప్రపంచకప్ ను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంది. అయితే అందరిలాగా విమానాల్లో ఖతార్ కు తాపీగా వెళ్లి అక్కడ మ్యాచ్ లు చూస్తే మజా ఏముంది..? అందుకే మహే నుంచి ఖతార్ దాకా ఫోర్ వీలర్ ట్రావెలింగ్ చేద్దామని ఫిక్స్ అయింది. అదీ ఒంటరిగా... అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకుని  మిగతా పనులు (అనుమతులు) పూర్తి చేసుకుంది.అన్నీ సిద్ధమయ్యాక గురువారం మహే నుంచి ఖతార్ కు బయల్దేరింది.   కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంథోని రాజు ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 

 

నౌషి.. మహే నుంచి కోయంబత్తూరు మీదుగా ముంబైకి చేరనుంది. ముంబై నుంచి ఓడ ప్రయాణం (ఫోర్ వీలర్ తో సహా) ద్వారా ఓమన్ కు చేరుకుంటుంది. ఓమన్ నుంచి  యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మీదుగా   ఖతార్ వరకు తిరిగి తన ఫోర్ వీలర్ లో  వెళ్లి ఫిఫా చూడనుంది. డిసెంబర్ 10 వరకు తాను ఖతార్ లో ఉంటానని  తెలిపింది.  

ఇదే విషయమై నౌషి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 10 వరకు  నేను ఖతార్ కు చేరుకుంటా. అక్కడ ఫైనల్ చూస్తా. నా యాత్ర గురించి నేను చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. నేను అర్జెంటీనాకు పెద్ద ఫ్యాన్ ను. లియోనల్ మెస్సీకి వీరాభిమానిని. ఆ జట్టు ఫైనల్ ఆడుతుందని నేను భావిస్తున్నా. అదే జట్టు ఫైనల్ లో కప్ కొడుతుందని నేను భావిస్తున్నా..’ అని తెలిపింది. ఈ యాత్ర తర్వాత ఆమె డిసెంబర్ 31 దాకా అక్కడే ఉండనుంది.  ఆ తర్వాత తిరిగి భారత్ కు చేరుకుంటుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios