SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్లను దాటేశాడు !
SMAT 2025 Most Runs : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా అద్భుత ప్రదర్శనతో 343 పరుగులు చేసి అభిషేక్ శర్మ, ఆయుష్ మాత్రేలను అధిగమించాడు. 6 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీలు బాది టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచాడు.

SMAT 2025 పరుగుల వర్షం కురిపంచిన కునాల్ చందేలా
ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025-26 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ పొట్టి ఫార్మాట్ టోర్నమెంట్లో ఎందరో స్టార్ ఆటగాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, ఈ సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక ఊహించని బ్యాటర్ పరుగుల వరద పారిస్తున్నాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు, ఐపీఎల్ సంచలనాలను సైతం వెనక్కి నెట్టి, దాదాపు ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతనే ఉత్తరాఖండ్ జట్టు కెప్టెన్ కునాల్ చందేలా. ప్రస్తుతం ఈ టోర్నీలో రన్ మెషీన్ గా మారి సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.
టాప్ ప్లేయర్లను అధిగమించిన కునాల్ చందేలా
టీ20 క్రికెట్లో ప్రస్తుతం నంబర్ వన్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ, ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో స్థానం సంపాదించిన యువ సంచలనం ఆయుష్ మాత్రే గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. అభిషేక్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయగా, ఆయుష్ మొదట దేశవాళీ క్రికెట్లో, ఆ తర్వాత అండర్-19 స్థాయిలో, ఇప్పుడు ఐపీఎల్ ఎంపికతో సత్తా చాటాడు.
వీరిద్దరూ టీ20 ఫార్మాట్లో స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు పొందారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం ఈ ఇద్దరు స్టార్లను ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా వెనక్కి నెట్టేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్తో టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు.
నిలకడైన ఆటతీరుతో పరుగుల సునామీ రేపుతున్న కునాల్ చందేలా
ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్ గణాంకాలను పరిశీలిస్తే, అతను ఎంత నిలకడగా ఆడుతున్నాడో అర్థమవుతుంది.
ఆడిన 6 ఇన్నింగ్స్లలో ఏకంగా 4 సార్లు హాఫ్ సెంచరీలు బాదాడు. అతని గత ఆరు ఇన్నింగ్స్ల స్కోర్లు వరుసగా 88, 94, 47, 8, 55, 51 గా ఉన్నాయి. ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, జట్టుకు భారీ స్కోర్లు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అభిషేక్, ఆయుష్లతో పోలిక.. కునాల్ చందేలా గణాంకాలు ఇవే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్లో కునాల్ చందేలా, అభిషేక్ శర్మ, ఆయుష్ మాత్రే ముగ్గురూ చెరో 6 మ్యాచ్లు ఆడారు. అయితే పరుగుల వేటలో కునాల్ అందరికంటే ముందున్నాడు. కునాల్ చందేలా 6 మ్యాచ్లలో 57.16 సగటుతో ఏకంగా 343 పరుగులు సాధించాడు. ఇక ఆయుష్ మాత్రే 325 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 6 మ్యాచ్లలో 304 పరుగులు చేశాడు.
కేవలం పరుగులే కాదు, బౌండరీల విషయంలోనూ కునాల్ పైచేయి సాధించాడు. ఈ సీజన్లో కునాల్ బ్యాట్ నుండి ఏకంగా 35 ఫోర్లు, 14 సిక్సర్లు వచ్చాయి. ఇదే సమయంలో ఆయుష్ మాత్రే 20 ఫోర్లు కొట్టగా, అభిషేక్ శర్మ 27 ఫోర్లు బాదాడు. రాబోయే మ్యాచ్లలో ఈ గణాంకాలు మారే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం కునాల్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు.
ఎవరీ కునాల్ చందేలా?
31 ఏళ్ల కునాల్ చందేలా కుడిచేతి వాటం బ్యాటర్. అతను ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఉత్తరాఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో అతను ఢిల్లీ జట్టు తరఫున కూడా క్రికెట్ ఆడాడు. ఢిల్లీలోనే జన్మించిన కునాల్, తన కెరీర్లో ఇప్పటివరకు అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 మ్యాచ్లు ఆడిన కునాల్, 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో మొత్తం 2389 పరుగులు సాధించాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 29 మ్యాచ్లలో 1040 పరుగులు చేయగా, టీ20 ఫార్మాట్లో 32 మ్యాచ్లలో 883 పరుగులు చేశాడు. అతని అనుభవం, ప్రస్తుత ఫామ్ కలగలిపి కునాల్ చందేలా ఈ సీజన్లో బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26: టాప్ 5 రన్ స్కోరర్లు వీరే
ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో 6 మ్యాచ్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా గమనిస్తే..
1. కునాల్ చందేలా (ఉత్తరాఖండ్): 6 మ్యాచ్లలో 343 పరుగులు
2. ఆయుష్ మాత్రే (ముంబై): 6 మ్యాచ్లలో 325 పరుగులు
3. అభిషేక్ శర్మ (పంజాబ్): 6 మ్యాచ్లలో 304 పరుగులు
4. ఆర్. స్మరణ్ (కర్ణాటక): 6 మ్యాచ్లలో 295 పరుగులు
5. యశవర్ధన్ దలాల్ (హర్యానా): 6 మ్యాచ్లలో 288 పరుగులు

