Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: హ్యాట్రిక్ కొట్టిన వినేశ్ ఫోగట్... భారత్‌కి 11వ గోల్డ్...

కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో సారి స్వర్ణం గెలిచిన వినేశ్ ఫోగట్... ఆసియా గేమ్స్, కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారత మహిళగా రికార్డు...

Vinesh Phogat wins the Gold Medal for India at Commonwealth Games 2022, creates records
Author
India, First Published Aug 6, 2022, 11:04 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ హ్యాట్రిక్ సాధించింది. 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వినేశ్ ఫోగట్, 2022లోనూ అదే ఫీట్ రిపీట్ చేసి... వరుసగా మూడు సీజన్లలో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...

అలాగే ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ గోల్డ్ గెలిచిన మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించింది వినేశ్ ఫోగట్. 53 కేజీల వుమెన్స్ ఫ్రీ స్టైయిల్ విభాగంలో పోటీపడిన వినేశ్ ఫోగట్, ఫైనల్‌లో శ్రీలంక రెజ్లర్ చమోద్య కేశని మదురవలగేతో మ్యాచ్‌లో 4-0 తేడాతో విజయం అందుకుంది...


టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, భారత రెజ్లర్ రవికుమార్ దహియా... కామన్వెల్త్ గేమ్స్ 2022లో పసిడి పట్టు పట్టాడు. 57 కేజీల విభాగంలో బరిలో దిగిన రవికుమార్ దహియా, రెండు సార్లు కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, నైజీరియా రెజ్లర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్నాడు...   

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించారు. కిడాంబి శ్రీకాంత్, ఇంగ్లాండ్ ప్లేయర్ పెంటీ టాబోని 21-19, 21-17 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కి వస్తే... లక్ష్యసేన, మారిషస్‌కి చెందిన జులిన్ జార్జ్ పాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-12, 21-11 తేడాతో ఓడించి సెమీస్‌కి చేరుకున్నాడు. 

వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన భారత్, వుమెన్స్ లాన్ బౌల్స్ ఈవెంట్‌లో, టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో, పారా పవర్ లిఫ్టింగ్‌లో ఒక్కో గోల్డ్ మెడల్ గెలిచింది. 

అంతకుముందు 50 కేజీల మహిళల రెజ్లింగ్ కాంస్య పతక పోరులో స్కాట్లాండ్ రెజ్లర్‌ లెచిజోతో జరిగిన మ్యాచ్‌లో 12-2 తేడాతో విజయం అందుకుంది భారత రెజ్లర్ పూజా గెహ్లాట్.. అండర్ 23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన పూజా గెహ్లాట్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ కూడా...

వుమెన్స్ బాక్సింగ్‌లో 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా కాంస్య పతకం సాధించింది. ఇంగ్లాండ్ బాక్సర్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిన జాస్మిన్ లంబోరియా... కాంస్యంతో సరిపెట్టుకుంది. 

టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ ప్లేయర్ మానికా బత్రా పోరాటం ముగిసింది. కామన్వెల్త్ మెడల్ లక్ష్యంగా బరిలో దిగిన మానికా బత్రా... వుమెన్స్ సింగిల్స్‌, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్‌లలో క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్‌లో, టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మానికా బత్రా, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. ఈ సారి మాత్రం పతకం లేకుండానే ఇంటిదారి పట్టింది మానికా...

మరో సీనియర్ టీటీ ప్లేయర్ శరత్ కమల్, మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ ఈవెంట్లలో ఫైనల్‌కి ప్రవేశించి రెండు పతకాలు ఖాయం చేసుకున్నాడు. సాథియన్‌తో కలిసి మెన్స్ డబుల్స్‌ ఆడిన శరత్ కమల్, ఆస్ట్రేలియా జోడీ నికోలస్ లమ్, ఫెన్ లూపై 3-2 తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరాడు...

మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీజ ఆకులతో కలిసి బరిలో దిగిన శరత్ కమల్, ఆస్ట్రేలియా మిక్స్‌డ్ జోడీ నికోలస్ లమ్- మిన్హుండ్ జీపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌ చేరాడు.  

స్వ్కాష్‌ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో భారత సీనియర్లు దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్, న్యూజిలాండ్ జోడీ జెల్లీ కింగ్, పాల్ కోల్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో పరాజయం పాలైంది. 2018లో న్యూజిలాండ్ జోడీని చిత్తు చేసిన భారత మిక్స్‌డ్ జోడీ, ఈసారి ఆ ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది. రేపు కాంస్య పతకం కోసం పోటీపడనుంది దీపికా, సౌరవ్ జోడీ...

Follow Us:
Download App:
  • android
  • ios