గోల్ కీపర్ శ్రీజేష్ కి ఎన్ఆర్ఐ భారీ నజరానా
భారత్ కాంస్య పతకం గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన శ్రీజేష్పై ప్రశంసల వర్షం కురిపించారు.
టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు కాంస్యం గెలవడంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. దీంతో.. ఆయనపై ప్రశసంల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ శ్రీజేష్ కి భారీ నజరానా ప్రకటించాడు.
యూఏఈకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ షంషీర్ వయలీల్.. భారత హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేష్కు భారీ నజరానా ప్రకటించారు. 5,00,000 దిర్హమ్ల (భారత కరెన్సీలో సుమారు కోటి రూపాయలు) నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. భారత్ కాంస్య పతకం గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన శ్రీజేష్పై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా.. టోక్యో వేదికగా కాంస్య పతకం కోసం జర్మనీ జట్టుతో జరిగిన పోరులో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. ఓ దశలో 1-3తో వెనుకడినా తర్వాత పుంజుకుంది. 5-4 స్కోరుతో విజయాన్ని కళ్లముందుంచింది. కానీ చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్ లభించిన వేళ.. గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి జట్టు గోల్ చేయకుండా గోడలా నిలబటంతో 41ఏళ్ల తర్వాత భారత్ ఒలింపిక్స్లో పతకం గెలిచిన విషయం తెలిసిందే.