థామస్ కప్ 2022లో ఫైనల్ చేరిన టీమిండియా... ఏషియానెట్తో పుల్లెల గోపిచంద్ స్పెషల్ చిట్ఛాట్...
థామస్ కప్ 2022 టోర్నీ సెమీ ఫైనల్లో డెన్మార్క్ని ఓడించిన భారత బ్యాడ్మింటన్ జట్టు... కుర్రాళ్ల విజయం, బ్యాడ్మింటన్కి క్రేజ్ తెస్తుందన్న పుల్లెల గోపిచంద్...
క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులతో బిజీగా ఉంటే, భారత బ్యాడ్మింటన్ జట్టు... థామస్ కప్ 2022 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థామస్ కప్లో ఇప్పటివరకూ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఎవ్వరూ పతకం కూడా గెలవలేకపోయారు...
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఫైనల్ చేరడంతో ఈసారి కనీసం రజతం, గట్టిగా కొడితే స్వర్ణం గెలవడం ఖరారైంది. కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు, డెన్మార్క్తో జరిగిన సెమీ ఫైనల్లో 3-2 తేడాతో విజయం అందుకుని, 73 ఏళ్లలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది...
2-2 తేడాతో స్కోర్లు సమంగా ఉన్న సమయంలో హెచ్ఎస్ ప్రణయ్, డెన్మార్క్ ప్లేయర్ రస్మస్ జెమ్కేని 13-21, 21-9, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడించి... భారత జట్టుకి అద్భుత విజయం అందించాడు. మొదటి సెట్లో ఓడిన తర్వాత ప్రణయ్, వరుసగా రెండు సెట్లు గెలిచి కమ్బ్యాక్ ఇచ్చిన ప్రణయ్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు మార్గం సుగమం చేశాడు...
ఈ విజయం తర్వాత ఏషియానెట్తో ప్రత్యేకంగా మాట్లాడారు జాతీయ బ్యాడ్మింటన్ ఛీఫ్ కోచ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) వైస్ ప్రెసిడెంట్ పుల్లెల గోపిచంద్..
‘థామస్ కప్లో బాయ్స్ ఫైనల్ చేరడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రతీ మ్యాచ్లోనూ ఓటమిని అంగీకరించకుండా పట్టువదలకుండా ఆఖరి వరకూ పోరాడి గెలిచారు. వాళ్లు సాధించిన విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యయం లిఖించబోతోంది.
ఈ విజయం దేశంలో బ్యాడ్మింటన్కి మరింత క్రేజ్ని తెస్తుందని అనుకుంటున్నా. భారత బ్యాడ్మింటన్ జట్టు సాధించిన విజయంపై నేనే కాదు, దేశమంతా గర్వపడుతోంది...’ అంటూ చెప్పుకొచ్చారు పుల్లెల గోపిచంద్...
సెమీ ఫైనల్ మ్యాచ్లో లక్ష్యసేన్ మరోసారి నిరాశపరిచాడు. ఒలింపిక్ విన్నర్ విక్టర్ అలెక్సన్ చేతుల్లో 13-21. 13-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు లక్ష్యసేన్. అయితే భారత డబుల్స్ జోడి సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి డబుల్స్ మ్యాచ్ గెలిచి 1-1 తేడాతో స్కోర్లను సమం చేశారు...
వరల్డ్ నెం.4 అండర్స్ అంటేసన్తో జరిగిన మ్యాచ్లో 21-18, 12-21, 21-15 తేడాతో అద్భుత విజయం అందుకున్నాడు కిడాంబి శ్రీకాంత్. గంటా 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్లో అఖండ విజయాన్ని అందుకున్నాడు శ్రీకాంత్...
అయితే ఆ తర్వాత భారత డబుల్స్ జోడి కృష్ణ ప్రసాద్, పంజాల విష్ణువర్ణన్ ఓటమి పాలవడంతో స్కోర్లు 2-2 తేడాతో సమం అయ్యాడు. ఈ దశలో ప్రణయ్ అద్వితీయ విజయంతో భారత జట్టును ఫైనల్కి చేర్చాడు. థామస్ కప్ 2022 టోర్నీ ఫైనల్లో 14 సార్లు టైటిల్ గెలిచిన ఇండోనేషియా జట్టుతో తలబడబోతుంది భారత బ్యాడ్మింటన్ జట్టు.