Nikhat Zareen: తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కొత్త చరిత్ర.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పతకం పక్కా
IBA Women's World Boxing Championships: ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కొత్త చరిత్ర సృష్టించింది. క్వార్టర్స్ లో ఇంగ్లాండ్ బాక్సర్ ను ఓడించి సెమీస్ కు దూసుకెళ్లింది.
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) ఆధ్వర్యంలో ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. సోమవారం క్వార్టర్స్ లో 52 కేజీల విభాగంలో ఇంగ్లాండ్ అమ్మాయి చార్లీ సియాన్ డేవిసన్ ను 5-0తో మట్టికరిపించి సెమీస్ కు దూసుకెళ్లింది. సెమీస్ కు వెళ్లడమే గాక భారత్ కు పతకం కూడా ఖాయం చేసింది. 25 ఏండ్ల నిఖత్ జరీన్.. ఈ ఈవెంట్ లో ఏ పతకం నెగ్గినా అది చరిత్రే. ఐబీఏ నిర్వహించే ఈ ఈవెంట్ లో భారత్ ఇంతవరకూ పతకం నెగ్గలేదు.
గతేడాది స్ట్రాండ్జ మెమోరియల్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన జరీన్.. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్ లో మంగోలియా కు చెందిన అల్తాంట్సెట్సెగ్ ను చిత్తు చేసింది. ఇక సోమవారం జరిగిన క్వార్టర్స్ లో కూడా అదే ఆటతీరును ప్రదర్శించింది.
తొలి రౌండ్ లో ఈ ఇద్దరూ హోరాహోరిగా పోరాడారు. అయితే రెండో రౌండ్ కు వచ్చేసరికి నిఖత్.. తన పంచ్ లతో డేవిసన్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తర్వాత రౌండ్లలో కూడా నిఖత్.. ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. దీంతో 5-0తో డేవిసన్ పరాజయం పాలైంది.
ఇదిలాఉండగా.. 48 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన నీతూ పోరాటం ముగిసింది. క్వార్టర్స్ లో కజకిస్తాన్ కు చెందిన అలువ బల్కిబెకొవ చేతిలో ఆమె 2-3 తేడాతో ఓడింది.