Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 విజేతగా టీమిండియా... ఫైనల్‌లో ఇరాన్‌పై ఘన విజయం..

ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 42-32 తేడాతో ఘన విజయం అందుకున్న భారత కబడ్డీ జట్టు... చివరి అర నిమిషంలో అదరగొట్టిన టీమిండియా.. 

team India Wins Asia Kabaddi Championship title beating Iran in final CRA
Author
First Published Jun 30, 2023, 2:09 PM IST

భారత కబడ్డీ జట్టు, ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ని కైవసం చేసుకుంది. కొరియాలోని బూసన్‌‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 42-32 తేడాతో ఘన విజయం అందుకుంది భారత కబడ్డీ జట్టు..

టీమిండియా కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ 42 పాయింట్లలో 16 పాయింట్లు తెచ్చి, టీమ్‌ని ముందుండి నడిపించాడు. తొలి సగం ముగిసే సమయానికి 19-9 పాయింట్లతో 10 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు. అయితే రెండో సగంలో ఇరాన్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి, 29-32 తేడాతో ఆధిక్యాన్ని   తగ్గించగలిగింది.. 

ఆట మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా సూపర్ ట్యాకిల్ చేసిన టీమిండియా, ఆలౌట్ చేసి 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత అర్జున్ దేశ్‌మన్ రైడ్‌లో 2 పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో 10 పాయింట్ల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది. 

ఇండియా, ఇరాన్ రెండు జట్లు కూడా వరుస విజయాలతో ఫైనల్‌కి వచ్చాయి. అంతకుముందు జపాన్‌తో మ్యాచ్‌లో 62-17 తేడాతో ఘన విజయం అందుకున్న భారత కబడ్డీ జట్టు, కొరియాపై 76- 13 తేడాతో గెలిచింది. చైనీస్ తైపాయ్‌తో మ్యాచ్‌లో 53-19 తేడాతో విజయాన్ని అందుకున్న భారత కబడ్డీ జట్టుకి ఇది 8వ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ టైటిల్..

ఇప్పటిదాకా 9 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా 2003లో ఇరాన్ ఈ టైటిల్ గెలిచింది. ఆ సీజన్‌లో భారత కబడ్డీ జట్టు, ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదు. మిగిలిన 8 సార్లు కూడా భారత కబడ్డీ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది...

2005, 2017 సీజన్లలో జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరి, టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్.. ఈసారి వీసా సమస్యల కారణంగా పోటీల్లో పాల్గొనలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios