Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరిగా పేరుగాంచిన స్మృతి మందాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ప్రకటించారు.
ఇన్స్టా రీల్తో
స్మృతి మందాన సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టరు. ఆమె సహచరులతో చేసిన ఫన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్ తో ఆమె జీవితంలో జరిగిన పెద్ద మార్పును తెలియజేశారు. జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో భారత క్రీడాకారిణులు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తుండగా, చివర్లో మందాన తన చేతిపై ఉన్న డైమండ్ రింగ్ను చూపిస్తూ కనిపించారు. ఈ రీల్ను స్మృతి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో నిశ్చితార్థం అధికారికంగా ధృవీకరించినట్లైంది.
పెళ్లి తేదీపై బజ్ – నవంబర్ 23నే వేడుక?
ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికల ప్రకారం నవంబర్ 23న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖ పంపినట్లు సమాచారం.
5 ఏళ్ల ప్రేమ కథ
స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ 2019లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. సంగీతం, క్రీడలపై ఉన్న ఆసక్తి ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ముచ్చల్ తరచూ మంధన మ్యాచ్లకు హాజరై ఆమెకు సపోర్ట్ చేసేవారు.
వరల్డ్ కప్ విజయంలో మంధాన కీలక పాత్ర
ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్కప్లో టీమిండియా విజయంలో మందాన కీలక పాత్ర పోషించారు. ఆమె ఈ టోర్నీలో 434 పరుగులు చేశారు. ఒకే వన్డే వరల్డ్కప్లో భారత క్రీడాకారిణిగా అత్యధిక పరుగులు చేసిన రికార్డు సాధించారు. అలాగే ఫైనల్లో షెఫాలీ వర్మతో కలిసి చేసిన అద్భుత ఓపెనింగ్ స్టాండ్, భారత జట్టుకు బలమైన స్కోరును అందించింది.


