భారత స్టార్‌ స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌ 2021కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు ఏ గ్రేడ్ ద్వారా అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా సాజన్‌ రికార్డు సష్టించాడు.

భారత స్టార్‌ స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌ 2021కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు ఏ గ్రేడ్ ద్వారా అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా సాజన్‌ రికార్డు సష్టించాడు. శనివారం ఇటలీలోని రోమ్‌లో సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్‌ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించాడు.

ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే అతడు లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ సాజన్‌ తిరగరాశాడు. గత వారం బెల్‌గ్రేడ్‌ ట్రోఫీ స్విమ్మింగ్‌ టోర్నీలో ఒక నిమిషం 56.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సాజన్‌ ప్రకాశ్‌ జాతీయ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఒలింపిక్స్‌లో ప్రకాశ్‌ పోటీపడటం ఇది వరుసగా రెండోసారి. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సాజన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ప్రకాశ్‌ నేరుగా అర్హత పొందడంతో.. మరో స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌కు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేకుండా పోయింది. అయితే ర్యాంకింగ్స్‌ ఆధారంగా శ్రీహరిని ఒలింపిక్స్‌ కోసం భారత స్విమ్మింగ్‌ సమాఖ్య నామినేట్‌ చేసింది. 

ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఇటువలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల ఉష్ణోగ్రత చూడటం తప్పనిసరి. మాస్కులు ధరించాలి. స్టేడియంలో మరో ప్రేక్షకుడిని కలవకూడదు. 

నిర్దేశించిన సీటులోనే కూర్చోవాలి. కేరింతలు కొట్టకూడదు. పోటీల తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి. క్రీడాకారుల్ని ఆటోగ్రాఫ్‌లు అడగడం, మద్దతు తెలపడం, మద్యపానం నిషేధం. ప్రేక్షకులు తమ ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేయొద్దని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు సూచించారు.