గురుపూజోత్సవం: అచ్రేకర్ ని గుర్తుచేసుకుని సచిన్ భావోద్వేగం
గురు పూజోత్సవం రోజున సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ అచ్రేకర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
గురు పూజోత్సవం రోజున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు క్రికెట్ ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్ కు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి దండం పెట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలోనే సచిన్ తనకు అచ్రేకర్ తో వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.
సచిన్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి అచ్రేకర్ సార్ తో టీచర్స్ డేను జరుపుకోలేకపోవడం బాధగా వుందన్నారు. ఆయన తనకు కేవలం క్రికెట్ మెళకువలే కాదు మంచి వ్యక్తిత్వాన్ని ఎలా సంపాదించాలో నేర్పించారు. తనను ఒక శిష్యుడిగా కంటే కన్న కొడుకుగా చూసుకునేవారన్నారు. అయన వల్లే తానీ స్థాయికి చేరుకున్నానని సచిన్ వెల్లడించాడు.
''ఉపాధ్యాయులు తమ శిష్యులకు కేవలం విద్యాబుద్దులు నేర్పించడమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతారు. అలా అచ్రేకర్ సర్ కూడా నా చిన్నపుడే క్రికెట్ ఎలా ఆడాలో మాత్రమే కాదు ఎలా జీవించాలో కూడా నేర్పించారు. ఆయన చెప్పిన గొప్ప మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంటాయి. నేను ఈ స్థాయిలో వున్నానంటే అది ఆయన చలవే." అని సచిన్ తన చిన్ననాటి కోచ్ అచ్రేకర్ ను గుర్తుచేసుకున్నారు.
సచిన్ మాత్రమే కాదు అచ్రేకర్ వద్ద క్రికెట్ మెలకువలు నేర్చుకున్న మరికొంత మంది కూడా టీమిండియా తరపున ఆడారు. వినోద్ కాంబ్లీ, బల్వీందర్ సింగ్, ప్రవీణ్ ఆమ్రేలు కూడా అచ్రేకర్ శిష్యులే. ఇలా చాలామంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయన సచిన్ గురువుగా మాత్రం గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఆయన మరణించారు.